Thursday 26 January 2012

భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం

భజగోవిందం - పరిపూర్ణ వ్యక్తిత్వానికి పునాది. (3)

         శంకరాచార్యులవారు  మానవ మానసిక విచలతకు మూల కారణాన్ని ఈ 3 వ శ్లోకంలో వివరించారు.  కడవంత  గుమ్మడికాయ  కత్తిపీటకు  లోకువన్నట్టు  ప్రతీ వ్యక్తి స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం
 చేసుకుంటున్నాడు.   '' ఎంతనేర్చినా  ఎంత చూసినా ఎంతవారలైనా  కాంత దాసులే ''  అని త్యాగరాజు గారన్నట్టు కాంతా వ్యామోహంలో తన జీవిత లక్ష్యాలను ఉపేక్షించిన వారు  చరిత్రలో కోకొల్లలు.  జహంగీర్   నూర్జహాన్  వ్యామోహంలో పడి తన రాజ్యాధికారాన్ని సైతం ఆమె చేతిలో పెట్టి  తన జీవిత పర్యాంతం లో   జహంగీర్  నామా  అనే ఆత్మకథలో  ఒక రొట్టె ముక్క కోసం,  గుక్కెడు మధువు కోసం తన అధికారాన్ని నూర్జహాన్ కు అమ్ముకున్నానని తలచి తలచి బాధపడతాడు.    ఈ శ్లోకాన్ని ఒక సారి పరిశీలించినట్లైతే.. 

                   నారీస్తనభర నాభీదేశం
                  దృష్ట్వా మాగామోహావేశం
                  ఏతన్మాంసవసాది వికారం
                  మనసి విచింతయ వారం వారం
భావం ;   స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.
       స్త్రీల బాహ్య సౌందర్యం చూసి మోహావేశంను పొంది  తమ కర్తవ్యాలను ఉపేక్షించినవారెందరో  నిత్యం కనబడుతుంటారు.  అరిషడ్వర్గాలలో  కామం  అనేది  అతి ముఖ్యమైనది. మనిషనేవాడు కోరికలపుట్ట. స్వేచ్చా జీవిగా
పుట్టిన  మానవుడు  సర్వత్రా సంకెళ్ళతో ఉన్నాడు  అన్నాడు రూసో.  ప్రాకృతిక స్వేచ్చ లో  ప్రతీ మనిషి  తన కోరికలు  తీర్చుకోడానికి  తన ఇచ్చానుసారం ప్రవర్తించవచ్చునేమో గాని  సామాజిక జీవితం  ప్రారంభమయిన  తర్వాత  కుటుంబ  వ్యవస్థ  అనేది  ఏర్పాటు  చేయబడి  మనిషి  తన  కోరికలను  తీర్చుకునేందుకు   కొన్ని  నియమాలు  ఏర్పాటు చేసారు.   ఎవరైనా ఈ కట్టుబాటులను     అనుసరించవలసినదే.
            కామప్రకోపాలను నియంత్రించుకోలేక స్త్రీల బాహ్యసౌందర్యమే ప్రధానంగా  వ్యామోహం  లో  చిక్కుకున్నట్టైతే  మనిషికి  పతనం  తప్పదు.   పరస్త్రీ  వ్యామోహంలో పడి తమ  భవిష్యత్తు నాశనం  చేసుకున్నవాళ్ళు  మనకు  చరిత్రలో  చాలామంది కనబడతారు. రావాణాసురుడు మరణించిన తర్వాత  రాముడు  అలసటతో  యుద్ధభూమిలో  ఒక రాతిపై  కూర్చొని  ఉన్నాడట. సూర్యాస్తమవుతున్నసమయంలో ఒక స్త్రీ  రాముడున్న   చోటుకి వస్తుంది.  రాతి పై  కూర్చొని  ఉన్న రాముడు  తన వైపు వస్తున్న  ఆ నీడ తనవైపు  రావడం  చూసి   ఆ నీడ తనకు  తగలకుండా   జరగసాగడట.    దానితో   ఆ  నీడ అక్కడే  ఆగి వెనక్కి    వెళ్ళిపోసాగింది.  రాముడు  బిగ్గరగా   ఎవరది  అని అడిగితే  ఆమె  ఆగి  దగ్గరగా వచ్చి ఇలా చెప్పిందట. ''  అయ్యా!  నేను  మండోదరిని.  రావాణాసురుని  భార్యను.   నా భర్త  అరివీర  భయంకరుడు.  గొప్ప శివభక్తుడు.  అలాంటి  మహా శక్తిమంతుడిని  వధించిన  వ్యక్తి  ఎలా  ఉంటాడో అతని గొప్పతనం   ఏమిటో  స్వయంగా తెలుసుకుందామని  వచ్చాను.   ఇక్కడకు వచ్చాక నాకు నా భర్త బలహీనత . అర్థం అయింది.   పరస్త్రీ నీడ  కూడా మీపై  సోకకుండా  మీరు  మిమ్మల్ని  నియత్రించుకుంటున్నారు.  మరి నాభర్త పరస్త్రీ వ్యామోహంలో ప్రాణాలను,  రాజ్యాన్ని కోల్పోయాడు. అదే మీ ఇద్దరిలో తేడా అని చెప్పి నమస్కరించి   అక్కడనుండి వెళ్ళిపోయిందట.
            ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని  ఆ బలహీనతను జయించడం ఎలా అన్న వారికి  శంకరాచార్యులు వారు దారి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో.   స్త్రీ  సౌందర్యం అంతా  మాంసం, క్రొవ్వు ల సమూహమే అనే ఏహ్య భావాన్ని అలవరుచుకోవడం  ద్వారా ఈ వ్యామోహం నుండి బయట పడవచ్చు.  వయస్సు ఊడిగిన నాడు ఈ బాహ్యమైన తళుకులు బెళుకులు నశిస్తాయని అర్థం చేసుకోవాలి.   భోగి కాని వాడు యోగి కాలేడు అన్న  వేమన యోగి గా మారడానికి అతనిలో కలిగిన వైరాగ్యం మరియు ఏహ్యతా భావనయే.  స్త్రీ వ్యామోహం లో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వేమన ఒక వేశ్య ఆకర్షణలో ఉంటాడు. ఆమె తన కోరిక తీర్చడానికి ఏదైనా బంగారు నగ కానుకగా కోరుతుంది. వేమన తన ఒదినె వద్దకు వచ్చి బంగారు నగ అడుగుతాడు. అది ఎందుకోసమో తెలుసుకున్న ఆమె  తన బంగారు నగను వేమనకు ఇచ్చి ఒక షరతు పెడుతుంది.  ఆ  వేశ్య ఆ నగను మరుగుదొడ్డిలో  నగ్నంగా ఉన్నప్పుడు తలను వచ్చి  కాళ్ళమధ్యగా వెనుకనుండి  ఆ నగను తీసుకోవాలని వేమనకు చెబుతుంది.  అలాగే అని వెళ్ళిన  వేమన  ఆ దృశ్యం చూడటంతో అతనిలో ఏహ్యతా భావం ఏర్పడి తన కామప్రకోపాలను త్యజించి, ఇటువంటి నీచమైన పనులలో తన యవ్వనం కోల్పోయానని యోగిగా మారుతాడు.  మనమైతే  యోగి గా మరనవసరం లేదు కాని అశాశ్వతమైన బాహ్య సౌందర్యాలు శాశ్వతమనే మాయలో పడకుండా ఉండగలిగి. లక్ష్యసాధనకు కృషి చేస్తే  చాలు..                   

No comments:

Post a Comment